వినాయక నిమజ్జానికి పకడ్బందీ చర్యలు
– ఊరేగింపుపై పోలీసు శాఖ ఆంక్షలు
– డీజే సౌండ్, మైకులకు నో పర్మిషన్
– 24 గంటల ముందే మద్యం దుకాణాల బంద్
– తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎల్లుండి బుధవారం జరిగే వినాయక నిమజ్జానికి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోనీయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సారి జరిగే వినాయక నిమజ్జన ఉత్సవాలలో పోలీసు శాఖల నుంచి పలు ఆంక్షలను విధించడం జరిగిందన్నారు. నిమజ్జన ఊరేగింపులో డీజే, సౌండ్ సిస్టమ్, మైకులకు పర్మిషన్ లేదన్నారు. బాజా భజంత్రీలతో వినాయకులను సాగనంపాలన్నారు. పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. నిమజ్జనం రోజున నిర్వహకులు మద్యాహ్నం 12 గంటల నుంచే వినాయకులను తరలించాలన్నారు. ఊరేగింపు పట్టణంలోని బస్టాండ్ వద్దకు రాగానే ఒక వినాయకుని వెంట కేవలం ఇద్దరు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ సారి వినాయకులను తాండూరు – కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నానది పురాతన వంతెన వద్ద నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వారిని కొత్త వంతెన మీదుగా తిరిగే వచ్చే సౌకర్యం కల్పించడం జరుగుతుందని వివరించారు. ఇందుకు తగిన ఏర్పాట్లను చేయాలని మున్సిపల్, ఆర్అండ్బి, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులను కోరడం జరిగిందన్నారు. వినాయక నిమజ్జనంకు 24 గంటల ముందు పట్టణంలోని వైన్స్ షాపులు, బార్లు, బెల్టుషాపులు మూసివేసేలా చూడాలని ఎక్సైజ్ అధికారులను కోరడం జరిగిందన్నారు. మరోవైపు తాండూరు ప్రాంతానికి సంబంధించి వినాయక మండపాల అనుమతులపై ఆన్లైన్ నుంచి 226 దరఖాస్తు వచ్చాయని తెలిపారు. ఇంకా మిగిలిన వారు అనుమతులు పొందాలని సూచించారు. వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ రాజేందర్రెడ్డి ఉన్నారు.

