పిడుగుల భీభత్సం
– యాలాల మండలంలో మూగజీవాల మృతి
– తుప్పెర్ల తాండా, నాగసముందర్లలో విషాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో పిడుగు పాటు ఘటనలు రైతుల్లో విషాదం నింపాయి. మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగు పాటు వల్ల ఎద్దు, లేగ దూడలు, మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనలు ఆదివారం జరిగాయి. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో పాటు మండలంలోని సంగాయిగుట్ట తాండా అనుబంద గ్రామం తుప్పెర్ల తాండా, నాగసముందర్ గ్రామంలో పిడుగులు పడ్డాయి.
తుప్పెర్ల తాండాలో గ్రామానికి చెందిన తుల్జానాయక్ రైతుకు చెందిన లేగదూడ, మూడు మేకలు మృతి చెందగా.. నాగసముందర్ గ్రామంలో ముదిరాజ్ మెట్టు రుస్తుమ్ కు చెందిన కాడెద్దు మృత్యువాత పడింది. ఈ సంఘటనతో ఆయా గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూగజీవాలు మరణించడంతో కంట కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు, పెద్దలు విజ్ఞప్తి చేశారు.


