గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్
– పోడు పట్టాల పంపిణీ సువర్ణాధ్యాయం
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– వికారాబాద్ జిల్లా గిరిజన రైతులకు పట్టాల పంపిణీ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల పక్షపాతిగా నిలిచారని, పోడు రైతులకు పట్టాలు అందించడంతో పాటు రైతుబంధు అమలు చేయడం సువర్ణాధ్యాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పోడు పట్టాల పంపిణీకి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన 436 మంది లబ్దిదారులకు 553 ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తూ లబ్దిదారులకు పోడు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులు సాగు చేస్తున్న పొలంపై ఎలాంటి భయాలు, అపోహలు పోగొట్టి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ పోడు పట్టాలు అందించడం గొప్ప సంచలన నిర్ణయమని అభివర్ణించారు.
గిరిజన జాతి చరిత్రలో పోడు పట్టాల పంపిణీ సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భమని లక్షా యాభై ఒక్క వేల మంది ఏకకాలంలో 4 లక్షల ఎకరాలకు భూ యజమానులు కాబోతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించిన చరిత్రలో లేదని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసిందని,అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఫారెస్ట్ కమిటీలను వేసి అర్హులైన పోడు రైతులను గుర్తించి నేడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్నారు. నేటి నుండి రాష్ట్రంలోని 4,05,601 ఎకరాల అటవీ భూమిని 1,50,012 మందికి అందించనున్నారన్నారు.పాలిగన్ సాంకేతిక సహాయంతో పకడ్బందీగా పోడుభూముల పట్టా (అటవీ భూ యాజమాన్య హక్కు ప్రతాలు)ను రూపొందించిందన్నారు. భూమి సర్వే నంబర్, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతోపాటు హోలోగ్రామ్ను అటవీ భూ యాజమన్య హక్కు పత్రంలో పొందుపరచడం జరిగిందన్నారు. దీంతో పంపిణీ చేసిన భూమి ఇరుగుపొరుగుతో భూ వివాదాలు లేకుండా చేస్తుందని మంత్రి తెలిపారు.భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మూడు శాఖల అధికారుల సమన్వయంతో పక్కాగా యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామన్నారు. గిరిజన పక్ష పాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలుస్తున్నారని, అనేక సమీక్షలు చేసి,అనేక మందితో చర్చించి పోడు భూముల పట్టాల నిర్ణయంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అడవులను కాపాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా సీఎం కేసీఆర్ పోడు రైతులకు పట్టాలు ఇస్తున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాటన్నింటిలో పోడు రైతులకు పట్టాలు అతి గొప్ప నిర్ణయం అన్నారు.
అదే విధంగా 500 జనాభా ఉన్న 3 వేల పై చిలుకు తాండలకు గ్రామ పంచాయతీలుగా మార్చడం, తండాలలో కనీస సౌకర్యాల కల్పనకు 15 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకు దక్కిందన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, సేవాలాల్ మహరాజ్ గారి జయంతి, వర్థంతి లను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. బంజారాల పేరు మీద ఉన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోనే బంజారా భవన్ నిర్మించి, బంజారా ఆత్మగౌరవ భవనం పూర్తి చేయించారన్నారు. రెండు కోట్లతో వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గ లలో బంజారా భవన్ లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై1లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తూ విద్యార్థుల విదేశీ విద్య కలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాకారం చేస్తున్నారన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ కోసం పీఎం మోడీ గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్న స్పందించడం లేదని,అయిన కూడా 10 శాతం రిజర్వేషన్లు గిరిజనులకు తెలంగాణ లో ముఖ్యమంత్రి గారు ఇచ్చారన్నారు. విద్యాలయాల్లో సీట్లతో పాటు,ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారన్నారు. పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని,ఈ వానాకాలంకు సంభందించి రైతు బంధు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా మండలాల జడ్పీటీసీ, ఎంపీపీలు, గిరిజనులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


