మహిళలకు రైట్.. రైట్..!
– బస్సుల్లో రేపటి నుంచే ఉచిత ప్రయాణం
– నేడు మార్గదర్శకాలపై ప్రభుత్వం ప్రకటన
– అమలుతో ఆర్టీసీకి నష్టమెంతో తెలుసా..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ప్రభుత్వం ఏర్పాటైన మూడు రోజు నుంచే రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేపట్టబోతోంది. రేపటి నుంచే ఈ గ్యారెంటీ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశానికి శుక్రవారం అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఇప్పటికే సమాచారం అందింది. ముఖ్యమంత్రితో భేటీలో ఆయా అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది తదితరాలను మార్గదర్శకాల్లో వెల్లడిస్తారు.
అమలుకు కసరత్తు
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకునేందుకు సంస్థ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం గురువారం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది. ఆ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం జూన్ నెల నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తోంది. ఆ రాష్ట్రంలో 22 వేల పైచిలుకు బస్సులున్నాయి. తెలంగాణలో బస్సుల సంఖ్య 8,571గా ఉంది. ‘ప్రస్తుతం కర్ణాటక బస్సుల్లో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య 40-41 శాతంగా ఉండేదని సమాచారం.
మనదగ్గర ఇదీ పరిస్థితి
తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది (12-13 లక్షల మంది) మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలుచేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇదికూడా చదవండి…

