ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!
– మార్చి 1 నుంచి పరీక్షలు
– ప్రతిపాదనలు సిద్దం చేసిన బోర్డు
– ఈసారి పరీక్షలు, ప్రాక్టికల్స్లో మార్పులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బొర్డు ముందుగా అలెర్ట్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈసారి జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ కళాశాలలు ప్రారంభం కావడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్ను ప్రకటించనుంది. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది.
మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్కు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు ఉంటే విద్యార్థులు సన్నద్ధమవడానికి వీలవుతుంది. దానికితోడు ఇంటర్ తర్వాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి.
పరీక్షలు, ప్రాక్టికల్స్లో మార్పులు
ఈసారి ఇంటర్ పరీక్షల విషయంలో పలు మార్పులు చేసేందుకు సిద్దమమయ్యారు. పర్యావరణ విద్య పరీక్ష మాత్రం అందరికీ పెట్టాలని నిర్ణయించారు. విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల ఎగ్జామ్ పెట్టరాదని భావించినట్లు తెలుస్తోంది. అందులోని అంశాలను ఆంగ్లం సబ్జెక్టులో మిళితం చేసినట్లు ఇంటర్బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. గతంలో రాయని పాత విద్యార్థులకు మాత్రం ఉంటుంది. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ను ఆయా కళాశాలలే నిర్వహిస్తాయి.
ఈసారి జస్ట్ ఏ మినిట్ పేరిట.. ఇచ్చిన అంశంపై ఒక నిమిషం ఆంగ్లంలో మాట్లాడటం, ఒక పేరాను చదవడం, సొంతంగా ఏదైనా ఒక అంశంపై రాయడం, ఒక ఆడియో పాఠాన్ని విని ప్రశ్నలు రూపొందించడం లాంటి వాటిని ప్రాక్టికల్స్లో చేరుస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్లో ఆంగ్లం సబ్జెక్టులో 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి…

