బీఆర్ఎస్ పార్టీకి షాక్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీకి షాక్…!
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ రాజీనామ
– బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ కు లేఖ
– నెక్ట్స్ స్టెప్‌పై ఉత్కంఠ..?

తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వప్న పరిమళ్‌ అనూహ్యంగా చైర్ పర్సన్ పదవిని దక్కించుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మద్య రెండున్నరేళ్ల ఒప్పందంతో ఆమె పదవిని చేపట్టినట్లు ప్రచారం ఉంది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఉండగా, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలో వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు కొనసాగుతున్నారు.

ఇద్దరి మద్య కొన్నాళ్లుగా కుర్చీ కొట్లాట జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అనూహ్యంగా తన రాజీమానాను ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆమె రాజీనామా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరుపున చైర్ పర్సన్ గా అవకాశం కల్పించడం పట్ల పార్టీకి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ గూటికి…

ఇదిలా ఉండగా బుధవారం నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెతో పాటు మున్సిపల్‌ కు చెందిన కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!