మిట్ట మధ్యాహ్నం గంజాయి విక్రయాలు
– డ్రైవర్ నుంచి 2 కిలోల ఎండు గంజాయి స్వాదీనం
– కేసు నమోదు చేసిన తాండూరు పట్టణ పోలీసులు
– వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మిట్ట మధ్యాహ్నం వేళ గంజాయి విక్రయానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం రమహత్ నగర్కు చెందిన యూనస్(45) అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ సంతోష్ కుమార్ ఎస్ఐ కాశినాథ్, సిబ్బందితో కలిసి దాడులు చేశారు. యూనస్ నుంచి 2 కిలోల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండుకు తరలించడం జరిగిందని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
పట్టుబడిన గంజాయి విలువ రూ. 50వేల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

