దిగ్విజయ దశమి..!
– జిల్లాలో విరాజిల్లిన పండగ శోభ
– తాండూరులో అట్టహాసంగా రావణ దహనం
– పాలపిట్ట దర్శనభాగ్యం కల్పించిన హిందూ ఉత్సవ సమితి
వికారాబాద్/తాండూరు, దర్శని ప్రతినిధి: దసరా సంబరాలలో జిల్లా ప్రజలు మునిగిపోయారు. శుక్రవారం వికారాబాద్, పరిగి, తాండూరు, కోడంగల్ నియోజకవర్గాల్లో విజయ దశమి వేడుకలను దిగ్విజయంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా ఉదయాన్ని ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల్లో ప్రతిష్టించిన దుర్గామాతలను కూడ దర్శించుకున్నారు. అనంతరం ఇంటింటా శమిపూజలు జరుపుకున్నారు.
శోభాయామానంగా ఉత్సవ ఊరేగింపు
తాండూరులో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి యేడాది దసరా ఉత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ యేడాది కూడ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని నేహ్రుగంజ్ నుంచి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. తాండూరు ఆర్యవైశ్య, వీరశైవ సమాజం సభ్యులతో కలిసి ర్యాలీని చేపట్టారు.
గంజ్ నుంచి గాంధీచౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడీ బజార్, పాత తాండూరు మీదుగా పాత తాండూరులోని భవాని మాత ఆలయం వరకు ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది.
అట్టహాసంగా వేడుకలు.. కనుల పండుగలా రావణ దహనం
అనంతరం భవాని మాత ఆలయం ముందు దసరా వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు హాజరయ్యారు. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు,
తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్లతో కలిసి భక్తులకు పాలపిట్ట దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిలు రావణ సంహారాన్ని ప్రారంభించగా బాణాసంచాల మంటల్లో రావణుడు కాలి బూడిదయ్యాడు. ఈ దృశ్యాలు కన్నుల పండుగలా కనిపించాయి.

హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు : ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు హిందూ ఉత్సవ సమితి అభివఋద్ధికి తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. దసరా ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలో హిందూ ఉత్సవ సమితి స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అట్టి స్థలాన్ని పెంచేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఎమ్మెల్సీ కోటా, తాండూరు మున్సిపల్ నుంచి నిధులు కేటాయించేందుకు దృష్టిసారిస్తామన్నారు.
108 అడుగుల హనుమాన్ విగ్రహా ఏర్పాటు : ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు-హైదరాబాద్ మార్గంలోని హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన భూమిలో 108 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. మునుముందు కూడ హిందూ ఉత్సవ సమితికి పూర్తి సహాకారం అందిస్తామని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నేతలతో కలిసి బోనమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
తరలివచ్చిన నేతలు
హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలలో తాండూరుకు చెందిన కుల సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, హిందు ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిపూర్ బాల్రెడ్డి, సభ్యులు బోయరాజు, బంటు మల్లప్ప, అంతారం కిరణ్, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, అంతారం లలిత, వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు దసరా సామూహిక వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బంతోబస్తు నిర్వహించారు.


