టైట్ ఫైట్‌లో టీఆర్ఎస్ ప‌క్కా ట్రీట్..!

తెలంగాణ రాజకీయం

టైట్ ఫైట్‌లో టీఆర్ఎస్ ప‌క్కా ట్రీట్..!
– హ‌జురాబాద్ క్యాంపేనింగ్‌కు మ‌రికొంత మంది నేత‌లు
– ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన టీఆర్ఎస్ పార్టీ
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మరం టీఆర్ఎస్, బీజేపీ మ‌ద్య టైట్ ఫైట్‌ను త‌ల‌పిస్తోంది. ఎలాగైనా బీజేపీని ఓడించాల‌ని టీఆర్ఎస్ పార్టీ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వాటిని అమ‌లు చేయ‌బోతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇకపై మరో లెక్క.. చందంగా కార్యాచ‌ర‌ణ రూపొందుతోంది. ఇక‌నుంచి ఈ రెండు వారాలు మోతమోగాల్సిందే. సభలతో హోరెత్తించాల్సిందే అనే ఉత్స‌హాంలో గులాబీ నేత‌లు ఉషారును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రచార బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఇప్పుడు మరికొందరిని సీన్‌లో దింపుతోంది. ఆదివారం జరిగే TRS శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి, పార్లమెంట్ ప్రతినిధుల సమావేశంలో మరికొందరికి క్యాంపేనింగ్ బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం కేసీఆర్. మండ‌లానికి ముగ్గురు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, MLCలు ప‌నిచేస్తున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. ఇక మంత్రి హ‌రీష్‌రావు పూర్తిస్థాయిలో హుజురాబాద్‌లోనే మకాం వేశారు. అన్నీతానై బాధ్యతలు తీసుకున్నారు. అయినా ఎందుకో అక్కడ టైట్‌ ఫైట్ నడుస్తోంది. ఈటలకు లోక‌ల్‌గా గ‌ట్టి ప‌ట్టు ఉండటం, ఆరు సార్లు గెలిచిన నేత‌గా ప్రజలతో వ్యక్తిగత ప‌రిచ‌యాలు ఉండడం, BJP కూడా ఎన్నిక‌ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో ట‌గ్ అఫ్ వార్ న‌డుస్తోంది. మెద‌ట్లో TRS కొంత బ‌లహీనంగా ఉన్నా… సీఎం KCR స్వయంగా ఫోకస్ చేసి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అక్కడ అమలు చేయడం.. స‌భ‌ కూడా నిర్వహించడంతో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. ఇదే అదునుగా భావించి ప్రతి మండలంలో రెండు మూడు స‌మావేశాలు ఉండేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రతి గ్రామాన్ని టచ్‌ చేయడం..కుల సంఘాలు, మహిళా గ్రూపుల‌తో మళ్లీ సమావేశాలు.. మంత్రుల రోడ్‌షోలు ఉండేలా ప్రణాళికలు రెడీ అయిపోయాయి. ఈ రెండు వారాలూ ఇంఛార్జ్‌ ఎమ్మెల్యేల‌తో పాటు, మంత్రులు, ఎంపీలు కూడా హుజురాబాద్‌లో పర్యటించనున్నారు. ఇక ఫైనల్‌ టచ్‌గా సీఎం కేసీఆర్ స‌భను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్నారు.