గ్యారెంటీలకు టెన్షన్ లేదు..!
– నిరంతరం ప్రజా పాలన సేవా కేంద్రం
– అర్హత పొందని లబ్దిదారులకు సేవలు
– మున్సిపల్కు పోటెత్తిన దరాఖాస్తు దారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను పొందేందుకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని యంత్రాంగం భరోసా కల్పించింది. తాండూరు మున్సిపల్లో ఆరు గ్యారెంటీ పథకాల కోసం మళ్లీ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. శనివారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రం ద్వారా దరఖాస్తుల సేవకరణ ముమ్మరంగా ప్రారంభమయ్యింది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రంలో ఆరు గ్యారెంటీల పథకాల దరఖాస్తులను స్వీకరించారు.

శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిన సేవా కేంద్రంలో పట్టణానికి చెందిన ప్రజలు మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్దిదారులు దరఖాస్తులు సమర్పించేందుకు బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవా కేంద్రం ద్వారా దాదాపు 90 దరఖాస్తులను స్వీకరించారు. ప్రస్తుతం ఒకటే కేంద్రం ఉండగా మంగళవారం నుంచి మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కమీషనర్ సేవా కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన లబ్దిదారులతో, మాట్లాడారు. ఎవ్వరు ఆందోళన పడాల్సిన పని లేదని, ప్రజా పాలన సేవా కేంద్రం సేవలు ప్రభుత్వ పని దినాలలో నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులు ఆరు గ్యారెంటీలు అంటే ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ తదితర పథకాలకు అర్హుత పొందకుంటే మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
మళ్లీ దరఖాస్తు సమర్పించే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు, గ్యాస్ రిసిప్ట్ తో పాటు గతంలో దరఖాస్తుకు అందించిన మోబైల్ నెంబర్ ఫోన్ తో కార్యాలయానికి కావాలని అన్నారు. మోబైల్ వెంట తీసుకవస్తే దానికి వచ్చే ఓటీపీతో వెంటనే ఆన్ లైన్ లో అప్ డేట్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, అధికారులు శానిటరీ ఇనుస్పెక్టర్ కృష్ణయ్య, రెవెన్యూ అధికారులు ఉమేష్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

