రైతులకు కేసీఆర్ గుడ్న్యూస్..
– ధాన్యం సేకరణకు గ్రీన్ సిగ్నల్
– గత యేడాది మాదిరిగానే కొనుగోలు కేంద్రాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వరి పండించిన రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్లో ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, యధావిధిగా ఈ ఏడాది కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలుకు కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ వర్షాకాలం కూడా గత సంవత్సరం మాదిరిగానే ధాన్యం సేకరణ జరిగేలా చూస్తామన్నారు.
