మున్సిపల్, ఆర్అండ్బి అధికారులకు షాక్..!
– రోడ్డు ధ్వంసంపై కోర్టులో పిటిషన్ వేసిన మహిళ
– రూ. 3లక్షలు పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్, ఆర్అండ్బి అధికారులకు పట్టణ మహిళ షాక్ ఇచ్చింది. రోడ్డు ధ్వంసంపై ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించారని, అందుకు కాను రూ. 3 లక్షల పరిహారం ఇప్పించాలని న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి… తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి సీతారాంపేట్ వరకు 2018లో బీటీ రోడ్డు వేశారు. ఒక యేడాది తరువాత ఈ రోడ్డును మిషన్ భగీరథ కింద పైపులు వేసేందుకు ధ్వసం చేశారు. ప్రజాధనం నుంచి లక్షలు వెచ్చించి వేసిన రోడ్డును ధ్వంసం
చేయడంపై ఆ ప్రాంతానికి చెందిన సూరబ్ కాంతా సార్డా 2019లో మున్సిపల్, ఆర్అండ్బి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో దుమ్ము, ధూళీ నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనికి నష్టపరిహారం అందించాలని ఆ శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో సూరబ్ కాంతా సార్డా మున్సిపల్, ఆర్అండ్బి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిస్తూ తాండూరు మున్సిఫ్ కోర్టులో పిటిషన్(ఓఎస్ నెంబర్ 322/2021) వేశారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం తాండూరు మున్సిపల్, ఆర్అండ్బి అధికారులకు గట్టిషాక్ ఇచ్చినట్లుగా మారింది.


