డేంజ‌ర్ జోన్‌లో తాండూరు..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

డేంజ‌ర్ జోన్‌లో తాండూరు..!
– పెరుగుతున్న కాలుష్యం.. ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు
– చిన్నారులు, వృద్ధుల‌పై ప్ర‌భావం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు డేంజర్ జోన్‌లో చిక్కుకుపోతుంది. ఇక్క‌డ రోజు రోజుకు పెరుగుతున్న‌కాలుష్యంతో పాటు చ‌లికాలం ఉష్ణోగ్ర‌త‌లు పడిపోతున్నాయి. దీనివ‌ల్ల చిన్నారులు, వృద్ధుల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తాండూరు ప‌ట్టణంలో కాలుష్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తాండూరు న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే ర‌హ‌దారులు దుమ్ము, దూళీ కాలుష్యంతో నిండిపోతున్నాయి.
ప‌ట్ట‌ణంలోని కోడంగ‌ల్ రోడ్డు నుంచి గౌతాపూర్ రోడ్డు వ‌ర‌కు దుమ్ము విప‌రీతంగా జిమ్ముతోంది. మిగ‌తా ర‌హ‌దారుల ప‌రిస్థితి కూడ అంతే. భారీ వాహ‌నాల రవాణా వ‌ల్ల వాటి వెంబ‌డి దుమ్ము చేల‌రేగి వెంట వ‌చ్చే వాహ‌నదారుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. దీంతోపాటు ప‌ట్ట‌ణంలో విప‌రీతంగా పెరిగిన వాహ‌నాల సంఖ్య‌తో వాయి కాలుష్యం కూడ ఏర్ప‌డుతోంది. దీనికి తోడి ఇప్పుడిప్పుడే చ‌లికాలం ప్రారంభ‌మ‌వుతోంది. చ‌లి వ‌ల్ల వాతావ‌ర‌ణంలో ఉష్ణోత్ర‌గ‌త‌లు ప‌డిపోతున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌కు హ‌నిక‌లిగించే విధంగా ఉంటాయ‌ని వైద్యులు
వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల‌పై ప్ర‌భావం చూపిస్తుందంటున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు బయట తిరగకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తాండూరులో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై సంబంధిత అధికారుల‌తో పాటు నాయ‌కులు ప్ర‌త్యేక దృష్టి సారించి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించాల‌ని ప‌ట్ట‌ణ వాసులు కోరుతున్నారు.