వార్డు సభ నిర్బంధం..!
– బీఆర్ఎస్ కౌన్సిలర్ను అడ్డుకున్న పోలీసులు
– అధికారులు, చైర్ పర్సన్ రాకపోవడంతో ఆందోళన
– ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నం
– పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చివరి రోజు జరిగిన వార్డు సభలో నిర్బంధ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో 35వ వార్డుకు సంబంధించిన వార్డు సభ ఏర్పాటు చేశారు. సభకు వార్డు కౌన్సిలర్ ఆసీఫ్ హాజరయ్యారు. అయితే సమావేశానికి అధికారులు, చైర్ పర్సన్ హాజరు కాకపోవడంతో అసహం వ్యక్తం చేశారు. పట్టణంలోని కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డులో జరిగిన వార్డు సభకు హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ను అడ్డుకునేందుకు వెళ్లేందుకు యత్నించారు.
అక్కడే ఉన్న పోలీసులు కౌన్సిలర్ ఆసీఫ్ను అడ్డుకున్నారు. ఆందోళన కారులను కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో వార్డు సభ నిర్బంధాన్ని తలపించింది. కౌన్సిలర్ ఆసీఫ్ పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వార్డులో ఉన్న అర్హులకు అరకొరగా సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అడుగుతామని పోలీసులతో వాగ్వివాదంకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు సర్దిచెప్పడంతో కౌన్సిలర్ ఆసీఫ్ శాంతించారు. ఆందోళన మద్యే వార్డు సభ కొనసాగింది.
ఇదికూడా చదవండి…

