కాలుష్యంపై దండెత్తిన తాండూరు యువత
– ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై నిరసన
– అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో పెరిగిపోతున్న దుమ్ము.. దూళీని నియంత్రించాలని తాండూరు యువత దండెత్తింది. సోమవారం తాండూరు యువత ఆధ్వర్యంలో పలువురు యువనాయకులు, యువకులు రోడ్లపై
బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ, బీజేవైఎం, కాంగ్రెస్ యువకులు రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ సేవ్ తాండూరు, తాండూరులో రోడ్లన్ని నిర్మించాలని అంటూ స్థానిక ఎమ్మెల్సీ, స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరులో పెరిగిపోతున్న కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని ధ్వజమెత్తారు. రోడ్లపై చెలరేగుతున్న దుమ్ము, ధూళీలో ప్రజలు అవస్థలు పడుతూ ఆనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని తాండూరులో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రోడ్లపై ఆందోళన, నిరసనలు చేపట్టిన యువ నాయకులను, యువకులను తాండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీవీవీ నాయకులు పర్యాద రామకృష్ణ, యూత్కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సత్యమూర్తి దొరశెట్టి, బీజేపీ నాయకులు తాండ్ర నరేష్, ఎన్ఎస్యూఐ నాయకులు సందీప్ రెడ్డి, జోగులా ఎబెజనర్, సతీష్, రఘప్రసాద్, దినేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


