కొన ఊపిరితో చిరుతపులి పిల్ల..!
– తాండూరు మండలంలో లభ్యం
– పశువైద్యుల వద్దకు తీసుకెళ్లిన గ్రామస్తులు
– చివరికి ఏం జరిగిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అడవి జంతువుల సంచారం జరుగుతున్నట్లు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిరుత పులులు, అడవి పిల్లిలు కనిపించిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా తాండూరు మండలంలో చిరుతపులి పిల్ల కొన ఊపిరితో లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

మండలంలోని కోటబాస్పల్లి గ్రామం శివారు.. కేరళ మోడల్ స్కూల్ సమీపంలో ఈ చిరుతపులి స్థానికుల కంట పడింది. వెంటనే తాండూరు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తాండూరు ఫారెస్ట్ ఆఫీసర్ ఫిర్యా నాయక్, బీట్ ఆఫీసర్, సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లారు. చిరుతపులి కొన ఊపిరితో ఉన్నట్లు గమనించి పిల్లను మల్కాపూర్ లోని ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. అక్కడి నుంచి తాండూరు పశు వైద్యశాలకు తీసుకవెళ్లి అక్కడి వైద్యులకు కూడా చూపించారు.

అప్పటికే పులి పిల్ల చనిపోయినట్లు నిర్దారించారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఫిర్యా నాయక్ మాట్లాడుతూ ఈ చిరుతపులి పిల్లను ఏవో పక్షులు ఎక్కడి నుంచో తీసుకవచ్చి ఉంటాయని, పులి పిల్లపై పక్షులు దాడి చేసిన ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు. మరోవైపు గ్రామంలో చిరుతపులి పిల్ల లభ్యమైన సంఘటన స్థానికంగా వైరల్గా మారింది. వాట్సాప్లలో చిరుతపులి పిల్ల ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
ఇదికూడా చదవండి…


