పులి పిల్ల కాదు.. అడవి పిల్లి..!
– ట్రాప్ కెమెరాకు చిక్కిన జంతువు
– పులి పిల్ల పుకార్లకు చెక్ పెట్టిన అధికారులు
– మరో రెండు రోజుల పాటు ట్రాప్ కెమెరాల నిఘా
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో అడవి పులి పిల్ల పుకార్లకు చెక్ పడింది. పులి పిల్ల కాదు.. అడవి పిల్లిగా అటవి శాఖ అధికారులు గుర్తించారు. గత మూడు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో తాండూరు అటవి శాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి ఆదేశాల మేరకు సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్ సిబ్బందితో కలిసి ఇందులో భాగంగా మల్కాపూర్ ఫ్యాక్టరీ సమీపంలో, సంగెంకలాన్ పరిసర ప్రాంతాల్లో మూడు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా మంగళవారం ఉదయం 10గంటల ప్రాంతంలో పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద అడవి పిల్లి ట్రాప్ కెమెరాలో కనిపించింది.

దీంతో కొన్ని రోజులుగా వస్తున్న అడవి పులి పిల్ల పుకార్లకు చెక్ పడింది. అడవి పులిపై ఫిర్యాదులు అందుకున్న అటవీశాఖ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల ప్రకటనతో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఊరట చెందారు. మరోవైపు అటవి జంతువులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని సెక్షన్ ఆఫీసర్ ఫిర్యా నాయక్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

