నవ వధువులకు గిఫ్టులిచ్చిన ఆర్టీసీ
– బస్సులు బుక్ చేసుకున్నందుకు కృతజ్ఞత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో గురువారం పెళ్లితో ఒక్కటైన నవ వధువులకు ఆర్టీసీ సంస్థ గిఫ్టులను అందజేసింది. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో పెండ్లిళ్లు జరుపుకున్న కుటుంభీకులు తాండూరు ఆర్టీసీ డీపో నుంచి బస్సులను బుక్ చేసుకున్నారు. పెండ్లి కోసం ఆర్టీసీ నుంచి బస్సులను బుక్ చేసుకున్న వారికి గిప్టులను
అందజేయాలని ఆర్టీసీ ఎండి పిలుపు మేరకు పెండ్లి వారికి కానుకలను అందజేశారు. ఆయా పెండ్లి కార్యక్రమాలకు హాజరైన సిబ్బంది చేత ఈ కానుకలను అందజేశారు. ఇందుకుగాను తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ రాజశేఖర్ పెండ్లి వారిందరికి కృతజ్ఞతలు తెలిపారు. డిపాజిట్ లేకుండా పెండ్లిళ్లకు బస్సులను అందజేస్తామని చేసిన ప్రకటనకు స్పందించి తక్కువ సమయంలోనే బస్సులను బుక్ చేసుకున్నారని మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి ఆర్టీసీకి ఇలాంటి స్పందన ఎల్లప్పుడు ఉంటే సంస్థకు పూర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆర్టీసీ సంస్థ కోసం నిరంతరం కృషి చేస్తున్న సిబ్బందిని కూడ మేనేజర్ అభినందించారు.


