పెద్దేముల్ గురుకుల పాఠశాలని తాండూరులో ఏర్పాటు చేయాలి

తాండూరు వికారాబాద్

పెద్దేముల్ గురుకుల పాఠశాలని తాండూరులో ఏర్పాటు చేయాలి
– బీసీ సంఘం తాండూరు క‌న్విన‌ర్ రాజ్‌కుమార్ కందుకూరి
– తాండూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌లంకు చెందిన గురుకుల పాఠ‌శాల‌ను తాండూరులో ఏర్పాటు చేయాల‌ని బీసీ సంక్షేమ సంఘం నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ రాజ్‌కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు.
మంగ‌ళ‌వారం రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో తాండూరు ఆర్డీఓ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పెద్దముల్ ప్రాంతానికి చెందిన గురుకుల పాఠశాలను చేవెల్లలో నిర్వహించడం వల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. పెద్దముల్ ప్రాంతం గురుకుల పాఠశాల తోపాటు కొడంగల్ కు చెందిన గురుకుల పాఠశాలను కూడా అదే ప్రాంతంలో నిర్వహించడం వల్ల విద్యార్థులకు మ‌రుగుదొడ్లు, ఇత‌ర వ‌స‌తులు లేక అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. పెద్దేముల్ గురుకుల పాఠ‌శాల‌ను నెల లోపు తాండూరులో నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంత‌రం డివిజన్ అధికారి మ‌హేష్ గౌడ్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ మహిళ అధ్యక్షురాలు జ్యోతి, నియోజవర్గ బీసీ యువజన కార్యదర్శి బోయ రాధాకృష్ణ, తాండూరు పట్టణ అధ్యక్షుడు రాజన్ గౌడ్, కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, బీసీ నాయకులు రమేష్ టైలర్, సంతోష్, బసవరాజ్, మతిన్, మహదేవ్, వెంకట్, శివ, రజక నరసింహ, మహేష్, విద్యార్థుల తల్లిదండ్రులు దోమ రవి, సుధారాణి, లలిత, ప్రతాపరెడ్డి, రమేష్, జీవరత్నం, గోపాల్, నర్సింలు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.