ఇంటింటికి ఫిల్టర్ తాగునీరు..!
– కాగ్నానది నుంచి సరఫరాకు కసరత్తు
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
– నది పంపుహౌస్లను పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఇంటింటికి ఫిల్టర్ వాటర్(శుద్ది చేసిన తాగునీరు) అందించేందుకు దృష్టిసారిస్తున్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్దం చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. తాండూరుకు జీవనాధారమైన కాగ్నానది నుంచి ఫిల్టర్ వాటర్ను సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి కాగ్నానది సమీపంలోని పంపుహౌస్ను సందర్శించారు. కమీషనర్ మధుసూధన్ రెడ్డి, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి పంపుహౌస్ పరిసరాలను పరిశీలించారు.

పంపు హౌస్ వద్ద మరమత్తులు, అవసరమైన వనరులు, సాంకేతిక అంశాలపై సమీక్షించారు. అనంతరం పాత తాండూరు సమీపంలోని కాగ్నానది పంపుహౌస్ పైపులైన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరాజ బాల్రెడ్డి మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో కాగ్నానది పంపుహౌస్ల నుంచి పట్టణానికి తాగునీరు నీటి సరఫరా పునరుద్దరణపై దృష్టిసారించడం జరుగుతుందని తెలిపారు. కాగ్నానది నుంచి పట్టణంలోని ఇంటింటికి శుద్ది చేసిన తాగునీరును అందించాలని నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్దం చేసి త్వరలోనే ఆచరణలోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


