గుండెపోటుతో కుప్పకూలిన కూలీ
– సీపీఆర్ చేసి దేవుడిలా ప్రాణం నిలిపిన స్థానికుడు
– తాండూరు మండలంలో మానవత్వం చాటిన ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుండెపోటుకు గురైన ఓ కూలికి ఓ స్థానికుడు సీపీఆర్ చేసి దేవుడిలా ప్రాణాలను కాపాడారు. మానవత్వం చాటిన ఈ సంఘటన తాండూరు మండలంలో చోటు చేసుకుంది.

మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన పింజరి రసీద్(58) అనే వ్యక్తి నాపరాతి కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం మండలంలోని చంద్రవంచ గేటు వద్ద ఉన్న ఓ హోటల్ వద్ద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలి పడిపోయాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న చింతకింది శ్రీహరి అనే వ్యక్తి సమయస్పూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేశారు.

గుండెపై ఒత్తిడి తెచ్చి.. ఊపిరి అందేలా చేసిన ప్రయత్నం ఫలించడంతో రషీద్ తిరిగి ప్రాణం పోసుకున్నాడు. గుండెపోటుకు గురైన కార్మికుడిని శ్రీహరి సీపీఆర్ చేసి కాపాడడంతో స్థానికులు అభినందించారు. అనంతరం రసీద్ను ఆసుపత్రికి తరలించారు. ఎవరైనా గుండెపోటుకు గురైతే సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చనే ఈ సంఘటనతో స్థానికులకు చైతన్యం కలిగించింది.


