బీసీ మహిళ సబ్ కోటాకు ఉద్యమించండి
– తాండూరు సంఘం నేతలకు ఆర్.కృష్ణయ్య పిలుపు
– ఆర్.కృష్ణయ్యను కలిసిన తాండూరు నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ మహిళ సబ్ కోటా కోసం భారీ ఉద్యమం చేపట్టాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తాండూరు బీసీ సంఘం నేతలకు పిలుపునిచ్చారు.

బుధవారం హైదరాబాద్లో ఆర్.కృష్ణయ్యను తాండూరుకు చెందిన బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య తాండూరులో బీసీ సంఘం ఉద్యామాలపై చర్చించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని ఆర్.కృష్ణయ్యకు వారు వివరించారు.

అనంతరం మహిళల కోసం ప్రత్యేక సబ్ కోటా అమలు చేయించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ విషయంలో తాండూరు నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు తాండూరులో బీసీ భవన్ నిర్మాణం గురించి ఆరా తీయగా బీసీ భవన్ ఏర్పాటుకు కోసం ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.


