కాలనీ ఓటర్లపై కాంగ్రెస్ కపటం..!
– సర్తో తారుమారు చేసేందుకు కుట్ర
– నేతల పర్యటనపై కౌన్సిలర్ జావిద్ ధ్వజం
– అభివృద్ధిపై లేని శ్రద్ద.. ఓటర్లపై ఎందకని సూటిప్రశ్న
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఓటర్లపై అధికార కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుందని ఆ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు.

ఆదివారం 8వ వార్డులో సర్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, పార్టీ నేతలు సర్ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని పర్యటించాన్ని ఆయన ఖండించారు. కౌన్సిలర్గా తనకు సమాచారం.. ప్రాధాన్యం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో పాటు బీఎల్ఓలతో పాటు అధికార పార్టీ బీఎల్ఏలతో ఓటర్ల సవరణ చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు కాలనీ ఓటర్లను తారుమారు చేసేందుకు కుట్ర చేస్తుందని అన్నారు. తమకు ఓటర్లను అనుకూలంగా మార్చుకునేందుకు కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.

తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న జంట కాలనీల అభివృద్ధిపై లేని శ్రద్ద ఓటర్లపై ఎలా ముంచుకొచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఏమాత్రం చిత్త శుద్ది ఉంటే కాలనీల అభివృద్ధిపై చూపించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తీరును ప్రజలు నమ్మరని అన్నారు.


