తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించొద్దు..!
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ విజ్ఞప్తి
– స్పందించి హామి ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తరలించకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ కోరారు.

శనివారం తాండూరు పర్యటనలో భాగంగా హైదరాబాద్ రోడ్డు మార్గంలోని నిర్వహించిన ప్రగతి సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ సమావేశం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడారు.

తాండూరులోని పేదలకు వైద్య సేవలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. ఆ ప్రయత్నాన్ని మానుకుని ఆసుపత్రిని తరలించకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు.

ఇందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ తాండూరులోని జిల్లా ఆసుపత్రి తరలింపుపై వస్తున్న ప్రచారం అవాస్తమని అన్నారు. ఆసుపత్రిని ఎక్కడికి తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా భరోసా అందించారు. ఇందుకు కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ మంత్రి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీనేతాజీలో ఎన్నికల కోలాహలం..!