మాతా, శిశువుల వైద్య సేవలకు వేళాయే..!
– ప్రారంభానికి సిద్దమైన ఎంసీహెచ్ ఆసుపత్రి
– రేపటి నుంచి అందుబాటులోకి వైద్యసేవలు
– వెల్లడించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మాతా శిశు ఆసుపత్రి వైద్య సేవలకు ముస్తాబయ్యింది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డుమార్గంలో నిర్మించిన ఈ ఆసుపత్రి తల్లులు, కాబోయే తల్లులతో పాటు చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు సిద్దమయ్యింది. ఈ విషయాన్ని శుక్రవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ మీడీయా సమావేశంలో వెల్లడించారు. దాదాపు రూ. 16 కోట్లతో ఆసుపత్రిని గత అక్టోబర్ 30న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో వైద్యసేవల ప్రారంభానికి నోచుకోలేదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల, వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ కర్త ఆదేశాల మేరకు శనివారం నుంచి వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ తెలిపారు. నూతన సంవత్సరం 2022 జనవరి 1 నుంచి మాతా శిశు ఆసుపత్రిలోనే ప్రసూతి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రసూతి ఆపరేషన్లు అక్కడే నిర్వహించబడతాయని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ(నవజాత శిశు సంరక్షణ కేంద్రం) అక్కడికి తరలించడం జరిగిందన్నారు. దీంతో పాటు చిన్నారులకు వైద్య సేవలు అక్కడే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గమనించి ప్రజలు ఎంసీహెచ్లోనే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు,, రాజకీయ నాయకులు, స్వచ్చంద సంఘాల ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

