ఆశావర్కర్లకు వేతనాల పెంపు
– ఉత్తర్వులు జారి చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశావర్కర్ల వేతనాలను సర్కారు పెంచింది. నెలవారిగా ఇచ్చే ప్రోత్సహాకాలలో 30 శాతం పెంచి వేతనాలు అందించనున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలో ఆశావర్కర్లు అందించిన సేవలను గుర్తించి ప్రోత్సహాకాలను పెంచడం జరిగిందని వెల్లడించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న ఆశా వర్కర్లందరికీ ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశా వర్కర్లు తమ నెల వారీ జీతం 7,500 అందుకుంటుండగా.. పెంచిన ఇన్సెంటీవ్స్తో వారికి రూ. 9,750 జీతం అందనుంది. కాగా పెంచిన ఇన్సెంటీవ్స్ని గతేడాది జూన్ నెల నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

