కాగ్నానదిపై 11 చెక్ డ్యాంలు
– చెక్ డ్యాంలతో సాగు, భూగర్భ జలాల పెంపు
– పురోగతిలో 5, పరిపాలన ఆమోదంలో మరో 6 చెక్ డ్యాంలు
– మన్సాన్పల్లి – క్యాద్గిరా మార్గంలో చెక్ డ్యాంల నిర్మాణం
– అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ పరిధిలో పారే కాగ్నానది పై నిర్మిస్తున్న చెక్ డ్యాంలను పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతంగానికి సాగునీరు అందించడంతో పాటు భు గర్భ జలాలను పెంచవచ్చని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులతో తాండూరు లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. చెక్ డ్యాంల పనులు చేపట్టిన ఆయా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని శాఖాపరమైన చర్యలకు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సాగునీరు ప్రధాన లక్ష్యంతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తూ ఉచిత కరెంటు ఇస్తున్నారని దానికి అనుకూలంగా జలాలు వృధాగా పోకుండా ఖర్చుకు వెనకాడకుండా ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారని దానికి అనుకూలంగా అధికారులు పని విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో చెరువులను కుంటలను చెక్ డ్యాంలు నింపడమే ప్రధాన బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కోట్పల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు ఆధునీకరించి పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. శివ సాగర్ ముంపు రైతులకు ఇద్దరు, ముగ్గురికి మినహా అందరికీ పరిహారం అందజేయడం జరిగిందని శివ సాగర్ ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం 5 చెక్ డ్యాంల నిర్మాణ దశలో ఉండగా.. మరో 6 చెక్ డ్యాంలు పరిపాలన ఆమోదంలో ఉన్నాయన్నారు. చెక్ డ్యాంల పనులు పూర్తయితే తాండూరు నియోజకవర్గ పరిధిలో సాగు విస్తీర్ణంతో పాటు భూగర్భ జలం పెరగనుందన్నారు. చెక్ డ్యాంలను పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతంగానికి సాగునీరు అందించడంతో పాటు భు గర్భ జలాలను పెంచవచ్చని అన్నారు. ఈ సమావేశంలో ఈఈ సుధీర్, డిఈలు పాల్గొన్నారు.

