అక్రమ రవాణాపై దృష్టి సారించాలి
– ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా మెలగాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశించారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ పోలీస్టేషన్ను జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు, పోలీసు సిబ్బంది ఎస్పీకీ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ పోలీస్టేషన్లో సిబ్బంది టర్న్ ఔట్ను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను ఆరా తీసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు తమ విధుల్లో చురుగ్గా వ్యవహరించాలన్నారు. పోలీస్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. ముఖ్యంగా పెద్దేముల్ పోలీస్టేషన్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున గుట్కా, గంజాయి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక, రేషన్ బియ్యం రవాణాను నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

