మరోకేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఊరట
– బౌన్సర్ల కేసు కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. ఈనెల 11న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన వ్యక్తిగత అనుచరుల వద్ద ఆయుధాలు కలిగిఉన్నట్లు నమోదు చేసిన కేసును నాంపల్లిలోని ప్రజా ప్రతినిధులు న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యేపై నమోదైన మరో కేసును కొట్టివేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బౌన్సర్లను కలిగి ఉన్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై తాండూరు పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం ఈ కేసును పరిశీలించిన నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పూర్వపరాలను పరిశీలించి కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీంతో ఈ కేసు నుంచి కూడ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

