ఉద్యమ కారులపై కేసులను ఎత్తివేయాలి

క్రైం తాండూరు వికారాబాద్

ఉద్యమ కారులపై కేసులను ఎత్తివేయాలి
– రైల్వే కోర్టుకు హాజరైన తాండూరు ఉద్యమకారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తాండూరు ఉద్యమ కారులు డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు 2011లో జరిగిన రైలురోకో కార్యక్రమంలో పాల్గొన్న తాండూరుకు చెందిన సాంబూరు సోమ శేఖర్, బైండ్ల విజయ్ కుమార్, ఫిరోజ్ఖాన్, ఎంవిజయ్ కుమార్, బంటారం భద్రేశ్వర్లపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టులో జరిగిన ఈ కేసు విచార‌ణ‌కు వారు హజరయ్యారు. విచారణ అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమ కారులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం జరిగింది అనే ప్రకటనలే తప్ప ఎలాంటి కేసులను ఎత్తివేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని అడ్డుకున్న వారే పదవులను అనుభవిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యమ కారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.