అవినీతి, అవతవకలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ..!
– చిక్కుల్లో బషీరాబాద్ సర్పంచు, ఉపసర్పంచు
– షోకాజ్ నోటీసులు అందించిన జిల్లా కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్ర సర్పంచు, ఉపసర్పంచులు చిక్కుల్లో పడ్డారు. పంచాయతి నిధులలో ఇద్దరు దుర్వినియోగం, అవతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. పంచాయతీ వ్యవహారం జిల్లా కలెక్టర్ దృష్టికి చేరడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో సర్పంచు, ఉప సర్పంచు పదవులకు గండం ఏర్పడింది. బషీరాబాద్ గ్రామ సర్పంచుగా పి.ప్రియాంక, ఉపసర్పంచ్ పర్వీనా భేగంలు కొనసాగుతున్నారు. అయితే 2019-20తో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీకి మంజూరైన 14వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం. గ్రామ పంచాయతీ నిధులలో దాదాపు రూ. 1 కోటి 13 లక్షల 557లను తాత్కాళికంగా దుర్వినియోగం చేసినట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో పాటు గ్రామంలో మిని ట్యాంకుల నిర్మాణం విషయంలో మూడు సార్లు నిధులు డ్రా, బిల్లుల చెల్లింపుల్లో రూ. 57 లక్షల 8వేల 281ల అవకతవకలకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. మరోవైపు షోకాజ్ నోటీసులో పేర్కొన్న సంవత్సరాలకు సంబంధించి ఎంబి, క్యాష్ రికార్డులు మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. 2018 పంచాయతీ రాజ్ చట్టం మేరకు జిల్లా కలెక్టర్ సర్పంచ్, ఉపసర్పంచ్ లకు షోకాజ్ నోటీలను జారీ చేశారు. ఈ నోటీసులను ఈనెల 7న జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, అవతవకలపై తగిన కారణాలతో వివరాలు అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ విధించిన గడువులోగా నిధుల దుర్వినియోగం, అవకతవకలపై నీ రైన వివరణ ఇవ్వకుంటే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసులో హెచ్చరించారు. దీంతో బషీరాబాద్ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులపై గండం ఏర్పడినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.



