తెలంగాణ వాసులకు చల్లని వార్త
– రాగల నాలుగు రోజుల వర్షాలు
– మండుటెండల నుంచి ఉపశమనం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: గత మూడు రోజుల క్రితం వరకు మండుటెండలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ మరో చల్లని వార్తను అందించింది. రానున్న 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై ఓ ప్రకటన కూడ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 23 నుంచి 27 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. అంతేకాకుండా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చల్లని వార్తతో ఉపశమనాన్ని ఆశ్వాదించేందుకు సిద్దమయ్యారు.


