కర్ణాటక నుంచి నకిలీ పత్తి విత్తనాలు
– డేట్ దాటిన ప్యాకెట్లలో విత్తనాల విక్రయం
– రూ. 6 లక్షల విలువైన విత్తనాల పట్టివేత
– 800 ప్యాకెట్లు సీజ్, నలుగురిపై కేసు
– నకిలీ విత్తనాల విక్రయాల గుట్టు రట్టు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం నుంచి సరిహద్దు తాండూరు ప్రాంతానికి రవాణా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల గుట్టును పోలీసులు, ప్రత్యేక బృందం రట్టు చేసింది. డేట్ దాటిన పత్తి విత్తనాలను ప్యాకెట్లలో విక్రయించేందుకు యత్నిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రూ. 6 లక్షల విలువైన 800 ప్యాకెట్లను సీజ్ చేశారు. అంతేకాకుండా విక్రయానికి పాల్పడుతున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. విక్రయానికి పాల్పడుతున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ కార్యాలయంలో జిల్లా ఎస్.కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.
బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్ నుండి గ్రీన్ సిటీ కాలనీ వెళ్లేదారిలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, వ్యవసాయ అధికారుల బృందం బైక్(AP 10 Az 3611)పై వెళ్తున్న కోడంగల్ మండలంలోని అంగడి రాయిచూర్ గ్రామానికి చెందిన నడిమించి శ్రీనివాస్ గౌడ్, కుర్వమల్లేశంలను ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఒక ఒక సంచిలో సుమారు 100 ప్యాకెట్ల పత్తి విత్తనాలు కనిపించగా వాటిని పరిశీలించగా “Leader99,BG-II ” అని ఉన్న విత్తనాల ప్యాకెట్లను గుర్తించారు. అయితే 450 గ్రాముల బరువుతో పాటు మూడు నెలల క్రితమే డేట్ ముగిసిందని గుర్తించారు. నిందితులతో మరింత లోతుగా విచారించగా శ్రీనివాస్ గౌడ్ తన బావ కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కనకడ్డకు చెందిన చిన్నకారు మోహన్, మల్లాపూర్కు చెందిన మెగులప్ప వద్ద నుంచి తీసుకవచ్చినట్లు తెలిపారు. పత్తి విత్తనాలతో పాటు నిషేధిత గ్లైసిల్ మందును తక్కువ ధరకు తీసుకవచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులపై అనుమానం పెరిగి అయ్యప్ప నగర్ శ్రీనివాస్ గౌడ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ కూడ 700 ప్యాకెట్ల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేసి నిందితులు ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్, కుర్వ మల్లేశం, కర్ణాటకకు చెందిన చిన్నకారు మోహన్, మొగులప్పలపై Crime number 99/2022, U/Sec 420 IPC, Section 6(b) in The Seeds Act, 1966 & Section 7 in The Essential Commodities Act, 1955 క్రింద తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ యొక్క బావ మోహన్ మరియ మొగలప్ప పరారీలో ఉన్నారు. మరోవైపు నిందితుల నుంచి 360 కేజీల బరువుతున్న మొత్తం 800 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాదీనం చేసుకోవడం జరిగిందని, వీటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నకిలీ విత్తనాల వ్యాపారం, తయారీకి సహకరించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ ఎన్.కోటిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రషీద్, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, తాండూరు వ్యవసాయ అధికారి రజిత, పోలీసు బృందం పాల్గొన్నారు.

