నిరుద్యోగులకు అలర్ట్..!
– వచ్చె ఆగస్టు 7న ఎస్ఐ రాత పరీక్ష
– 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
– వెల్లడించిన పోలీసు నియామక బోర్డు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధిఐ : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు రాష్ట్ర పోలీసు నియామక బోర్డు అలర్ట్ ప్రకటించింది. పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదట నిర్మించే ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు మాసంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ళశాఖ, ఎక్సెజ్, రోడ్డు రవాణా శాఖల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ ఉద్యోగ అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. ఈ నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులకు 200 మార్కులకు గానూ 30శాతం అంటే 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లు, ఎవరైతే నిర్ణీత మార్కులను దాటుతారో ఆ అభ్యర్థులు తర్వాత పరీక్షలకు అర్హులవుతారని స్పష్టం చేసింది.

