వణికిస్తున్న వైరస్‌లు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

వణికిస్తున్న వైరస్‌లు..!
– కరనోనా, ఇన్‌ఫ్లుయెంజాల ఉదృతి
– తెలంగాణతో పాటు 6 రాష్ట్రాలకు అలెర్ట్
– రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్రం
దర్శిని డెస్క్‌: దేశంలోని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఎందుకంటే కొన్ని వారాలుగా దేశంలో కరోనాతో పాటు ఇన్‌ప్లూయెంజా వైరస్‌ల ఉధృతి పెరిగింది. కొవిడ్‌ కేసులు (Covid 19), వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) లేఖ రాసింది. ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. కర్ణాటకలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.77గా ఉండగా, కేరళలో 2.64శాతం, తమిళనాడులో 1.99శాతం, మహారాష్ట్రలో 1.92శాతం, గుజరాత్‌లో 1.11శాతం, తెలంగాణలో 0.31శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. మార్చి 8నాటికి దేశంలో మొత్తం 2082 క్రియాశీల కేసులు ఉండగా.. తదుపరి వారంలోనే అవి 3264కు చేరుకున్నాయని నివేధికలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే, కొవిడ్‌-19 కేసులు పెరుగుతోన్న సమయంలోనే అటు హెచ్‌3ఎన్‌2 వ్యాప్తి కూడా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు 450పైగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదుకాగా.. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇన్‌ఫ్లుయెంజాతోపాటు కొవిడ్‌ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది. వీటితోపాటు అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో టెస్టుల (Corona Test) సంఖ్య పెంచడంతోపాటు వ్యాక్సినేషన్‌పైనా (Vaccination) దృష్టి పెట్టాలని పేర్కొంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది.