జాతరలో మళ్లీ లొల్లీ..!
– భద్రేశ్వర రథోత్సవంలో రాజకీయ రగడ
– కొట్లాటకు దారితీసిన అధిపత్య పోరు
– పోలీసుల చర్యలతో అదుపులోకి ఉద్రిక్తత
తాండూరు, దర్శిని ప్రతినిధి: శాంతి, సారమస్యలతో ఎంతో ప్రశాంతంగా జరిగే తాండూరు భావిగి భద్రేశ్వర జాతర రథోత్సవాలలో మళ్లీ లొల్లి జరిగింది. గత యేడాది ప్రోటోకాల్ చిచ్చు చోటు చేసుకోగా.. ఈ సారి ఆదిపత్య ప్రదర్శన కోసం కొట్లాటకు సిద్దమయ్యారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మద్య మళ్లీ ఈ రగడ చోటు చేసుకోవడం గమనార్హం. తాండూరు రాజకీయాలలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు ఆయన వర్గీయులలో వర్గపోరు తారాస్థాయిలో ఉందని తాజాగా జరిగిన సంఘటన ఉదహరణగా నిలుస్తోంది. గత మూడేళ్ల క్రితం కరోనా విజృంభణతో తాండూరులోని భద్రేశ్వర జాతర ఉత్సవాలు సాదాసీదాగా జరిగాయి. గత యేడాది క్రితం ఆ మహమ్మారి దూరం కావడంతో జాతర ఉత్సవాలు భక్త జనసందోహం మద్య నిర్వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన జాతర ఉత్సవాలలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జాతర ఉత్సవాలకు ముందుగా హాజరై కూర్చున్నారు. ఆ తరువాత వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అతని అనుచరులకు ప్రత్యేక కార్పేట్ వేయడంతో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాంటి ఎలాంటి పొరపాట్లు జరగకూడదని అధికారులు, నిర్వహకులు జాగ్రత్తలు తీసుకున్నా రథోత్సవంలో రగడ చోటు చేసుకోవడం తప్పలేదు. ఈ సారి కూడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన అనుచరులు జాతర ఉత్సవాలకు ముందుగానే హాజరయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన అనుచరులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య అనుకోకుండా ఆదిపత్య ప్రదర్శన వివాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఎమ్మెల్సీ వర్గీయులపై చేయి చేసుకునేదాక వెళ్లింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టారు. దీంతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు వర్గపోరు, ఆదిపత్య ప్రదర్శనలతో రచ్చకెక్కడంపై ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు సైతం విమర్శలు చేస్తున్నారు.

