అనుమానంతోనే అఘాయిత్యం..!
– వైద్యానికి డబ్బులు ఇవ్వలేక ఘాతుకం
– మంత్రాలు ప్రయోగిస్తాడని కత్తితో దాడి
– వీడిన.. ఆర్ఎంపీ వైద్యుడిపై హత్యాయత్నం మిస్టరీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వైద్య రంగం ఒకప్పటిలా కాకుండా నయం చేయలేని రోగాలను కూడా తగ్గిస్తూ కార్పోరేషన్ స్థాయికి ఎదిగింది. అయినా కూడా కొంత మంది ఆర్ఎంపీ వైద్యులను, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. మూడనమ్మకాల ముసుగులో చిక్కుకుపోయిన ఓ ఇద్దరు నిందితులు తమపై మంత్రాలు ప్రయోగిస్తాడమో అని అనుమానంతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కి పంపారు. తాండూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరుకు చెందిన మక్బూల్ అహమ్మద్ స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు.
అయితే గత నెల 30న రాత్రి ఓ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతని కార్యాలయానికి వచ్చారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు ఆర్ఎంపీ వైద్యుడు ఇప్పుడు సమయం అయిపోయింది. రేపు రండి అని చెప్పడంతో ఓ వ్యక్తి మా అమ్మతో ఫోన్లో మాట్లాడాలని ఫోన్ చేసి ఇచ్చాడు. వైద్యుడు ఫోన్ మాట్లాడే సమయంలో వెంటనే వ్యక్తి చాకు తీసుకుని గొంతు కోసేందుకు యత్నించాడు. వైద్యుడు చేతితో విడిపించుకునేందుకు యత్నించాడు.
వెంటనే అరడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధిత ఆర్ఎంపీ వైద్యులు మక్బూల్ అహమ్మద్ తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి దాడిచేసినట్లుగా గుర్తించారు.
వ్యాధి నయం చేయలేదని గొడవ
అయితే నిందితులు గతంలోనే ఆర్ఎంపీ వైద్యుడు మక్బూల్ అహమ్మద్ వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లారు. అప్పుడు వారికి తాయత్తు కట్టడంతో పాటు మందులు, నిమ్మకాయలు ఇచ్చి పంపాడు. నిమ్మకాయలను దిండుకింద పెట్టుకుని పడుకోవాలని సూచించాడు. ఆర్ఎంపీ వైద్యుడు సూచించిన విధంగా చేసినా ఆరోగ్యం నయం కాకపోవడంతో గత నెల 30న మళ్లీ ఆర్ఎంపీ వైద్యుని కార్యాలయానికి వచ్చారు.
వారు తమ ఆరోగ్యం ఇంకా నయం కాలేదని వివరించడంతో మరికొంత డబ్బులు ఇస్తే నయం చేస్తానని చెప్పారు. దీంతో వారి మద్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే వైద్యం కోసం వారి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇవ్వకపోతే తమపై మంత్రాలు ప్రయోగిస్తాడని అనుమానం పెంచుకున్నారు. వెంటనే మాటల్లో ఉంచి కత్తితో గొంతుపై దాడి చేసి గాయపరిచారు.
కేసు నమోదు కావడంతో పోలీసు కానిస్టేబుళ్లు అంజద్, శివకుమార్, సాయప్ప, సాబిల్లు ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించినట్లు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డిలు అభినందించారు.
ఇది కూడా చదవండి…

