ప్రగ్నెంట్ ఫ్రాంక్..!
– కాపురం కోసం కడుపు అంటూ మాయ
– ఆసుపత్రిలో గర్భస్రావం అయ్యిందని డ్రామా
– చివరకు బయటపడిన నిజం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తన సంసార బంధాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ తాను గర్భం దాల్చినట్లుగా డ్రామ చేస్తూ భర్త, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. ఈ అబద్దం నుంచి తనను కాపాడునేందుకు ప్లాన్ వేసింది. ఆసుపత్రిలో చేరి గర్భస్రావం అయ్యిందని డ్రామా చేసింది. ఆ డ్రామా సరిగ్గా పడంక పోవడంతో అసలు నిజం బయటకు వచ్చింది. జనగామ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై వైద్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా దేవరుప్పుల మండలంలోని ఓ తండాకు చెందిన వివాహిత (23)కు సంతానం లేరు. రెండేళ్లయినా పిల్లలు పుట్టకపోయేసరికి తన కాపురం ఏమై పోతుందో అనే ఆందోళనకు గురైంది.
ఈ క్రమంలో తాను గర్భం దాల్చినట్లు ఆమె కొద్ది నెలలుగా ఇంట్లో వారిని నమ్మించింది. ఇంట్లో వాళ్లను నమ్మించే ప్రయత్నాలు అన్నీ చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చి ఓపీలో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. బుధవారం మళ్లీ వచ్చి తనకు పురిటినొప్పులు వస్తున్నాయని ఓపీలో నమోదు చేయించుకుంది. నిజమేననుకున్న వైద్యురాలు సాధారణ కాన్పు చేస్తామని చెప్పింది. ఇంతలో ఆమె బాత్రూమ్కు వెళ్లి అందులో నుంచి అరిచి తనకు రక్తస్రావమైందని, పిండం పడిపోయిందని చెప్పింది.
వెంటనే అప్రమత్తమైన వైద్యురాలు మౌనిక, ఇతర వైద్య సిబ్బంది బాత్రూమ్లో పరిశీలించగా ఎలాంటి రక్తస్రావం ఆనవాళ్లు లభించలేదు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా అసలు గర్భం దాల్చలేదని తేలడంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, భర్తతోపాటు పలువురు బంధువులు ఆమెను నిలదీయడంతో పిల్లలు పుట్టకపోయేసరికి టవల్స్ చుట్టుకొని నమ్మించానని చెప్పింది. ఆ మహిళకు పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ దామోదర్రెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి..

