ఆర్టీసీలో సమ్మె సైరన్..!
– సంస్థకు నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ
– నోటీసులో సమ్మె తేది కూడా వెల్లడి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే పరిణామాలు కనిపిస్తున్నాయి. సోమవారం తెలంగాణ్ బస్ భవన్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు. తమ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల (ఫిబ్రవరి 9) సమ్మె బాట పడతామని కార్మిక జేఏసీ తెలిపింది. గతంలో ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లింపు తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. యూనియన్లు రద్దు చేసి, కార్మికులకు పనిగంటలు పెంచారని, ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం లేదని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇదికూడా చదవండి…

