టిట్కెట్టు తీసుకొని డబ్బులు మరిచారా..!
– ఇలా చేస్తే ఆ డబ్బులు తిరిగోస్తాయ్
– బస్సుల్లో మరిచిన సామాన్లను కూడా పొందొచ్చు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ సర్వీసులు కీలకంగా నిలుస్తాయి. అలాంటి బస్సుల్లో ప్రయాణికులు చాలా సందర్భాలలో టిక్కెట్లు తీసుకుని కండక్టర్ నుంచి తిరిగి డబ్బులను తీసుకోవడం మరిచిపోతుంటారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ప్రయాణానికి సరిపడా చిల్లర ఇవ్వక పోవడంతో కండక్టర్లు మిగతా డబ్బులు టికెట్ వెనుక రాసి ఇస్తారు. గమ్యం చేరాక ఆ డబ్బులు కండక్టర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. గమ్యం చేరాక గబగబ దిగేసి వెళ్లిపోతుంటారు కొందరు.

ఇంటికి చేరాక కండక్టర్ ఇవ్వాల్సిన మిగతా డబ్బులు గుర్తుకొస్తే ఏమి చేయాలో తెలియక వదిలేస్తుంటారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఉపశమనం పొందే వార్త ఇది. ఆర్టీసీ బస్సు టిక్కెట్పై సంస్థ ఓ హెల్ప్ లైన్ నంబర్ ముద్రించి ఉంటుంది. దాని ఉపయోగంపై చాలా మంది దృష్టి పెట్టరు. ఈ టికెట్పై ఉన్న హెల్ప్ లైన్ నెంబరు 040-69440000కు సమాచారం ఇస్తే తిరిగి మీకు రావాల్సిన డబ్బులు పొందవచ్చు. సదరు ప్రయాణికుడు అందించిన సమాచారంపై సంస్థ అధికారులు విచారణ చేసి ఫోన్పే ద్వారా అందిస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులో విలువైన వస్తువులు, బ్యాగులు, సెల్ ఫోన్లు మర్చిపోయినా హెల్ప్ లైన్ నెంబరు ద్వారా పొందవచ్చు. దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు బస్సు మిస్ అయిన ఆ నెంబరుకు ఫిర్యాదు చేస్తే అదే టికెట్పై మరోక బస్సులో తమ గమ్యానికి చేరవేర్చే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం అందరు తెలుసుకుంటే ఉపయోగాలు పొందొచ్చు.
ఇదికూడా చదవండి…

