బ్యాంకు అంటుకుపోయింది…!
– అకస్మాత్తుగా భగ్గుమన్న మంటలు
– కరణ్ కోట్ ఎస్బీఐ బ్రాంచ్లో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : డబ్బులు దాచుకునే బ్యాంకు అంటుకుపోయింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో భగ్గుమని బుగ్గిపాలైంది. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా కరణ్ కోట్ పరిధిలో ఎస్బీఐ బ్యాంకు శాఖ కొనసాగతోంది.

ఈ బ్యాంకులో ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు ఖాతాల ద్వారా లావాదేవిలు అందిస్తోంది. అయితే మంగళవారం ఉదయం బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా పెరుగుతూ బ్యాంకు మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అందులోని వారంతా బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపుచేసే ప్రయత్నం ఫలించలేదు. మంటలు పూర్తిగా వ్యాపించాయి. వెంటనే తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయనే కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాండూరు ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో కోడంగల్ నుంచి ఫైర్ ఇంజన్ను రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా బ్యాంకులో అధికారులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదంకు కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి….

