అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

తాండూరు రాజకీయం వికారాబాద్

అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు
– పెట్రోల్, డీజిల్‌ సరఫరాపై వదంతులు నమ్మొద్దు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పెట్రోల్, డీజిల్ సరఫరా.. కొరత విషయంలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా హెచ్చరించారు.

బుధవారం ఓ ప్రకటనలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిని నమ్మరాదని అన్నారు. పెట్రోల్‌ బంకుల వద్దకు బారులు తీరడం వల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు.

కావున ఎవరైనా పెట్రోల్ లేదా డీజిల్ కొరత ఉందంటూ ప్రచారం చేస్తే వారిని గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇంధనాన్ని నిల్వ చేయకూడదని కోరారు. ఎవరైనా అక్రమంగా నిల్వలు చేపడితే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నేత్ర పర్వంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన