ఫించన్ల దరఖాస్తుల్లో ఆందోళన వద్దు
– దరఖాస్తు దారులు తమను సంప్రదించండి
– మున్సిపల్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫించన్ల విషయంలో దరఖాస్తు దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తాండూరు మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు.

శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈ నెల 25తో ఫించన్ల దరఖాస్తుల గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ ప్రచారాన్ని ఎవ్వరు నమ్మరాదని సూచించారు. అధికారికంగా ప్రభుత్వం దరఖాస్తుల విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వచ్చేనెల జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల మంజూరు కాబోతున్నాయని తెలిపారు.

దీనిపై ప్రభుత్వం అధికారిక ఆదేశాలు వచ్చిన తరువాత తెలుస్తుందని అన్నారు. కావున లబ్దిదారులు, అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఫించన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వార్డులోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. దరఖాస్తుల విషయంలో ఎలాంటి అనుమనాలు ఉన్నా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఆదివారం రోజంతా కార్యాలయం తెరిచి ఉంటుంది, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉంటామని తెలిపారు. పాస్పోర్ట్ సైజు ఫోటో, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలనె వెంట తీసుకురావాలని సూచించారు.


