భక్తి పారవశ్యంలో.. కట్టమైసమ్మ జాతర..!
– గాంధీనగర్లో జాతర వైభవం
– భక్తుల సందడి, పార్టీలకు అతీతంగా నేతల కలయిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్లో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.. కట్టమైసమ్మ తల్లి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

వార్డు నంబర్ 20లోని కట్టమైసమ్మ ఆలయ జాతర ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, మొక్కులు, దర్శనాలతో గాంధీనగర్ పండుగ శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

జాతర సందర్భంగా వార్డు కౌన్సిలర్ నవీన్ సంతోష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీనగర్ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కట్టమైసమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.

కట్టమైసమ్మ జాతరలో రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రస్తుత, మాజీ కౌన్సిలర్లు ఒకే వేదికపైకి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు సంపత్, శంకర్ యాదవ్, బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ తదితరులు జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


