ధరణి సమస్యలకు ప్రతివారం పరిష్కారం
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయం
– తాండూరు, వికారాబాద్ డివిజన్ల వారిగ సమీక్ష
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వ్యవసాయ భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరిణి వ్యవస్థతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ అధికారుల చుట్టు ప్రదక్షణలు చేస్తూ విసిగి వేసారుతున్నారు. వికారాబాద్ జిల్లాలో కోవిడ్ మహమ్మారి తరువాత జిల్లా కలెక్టర్ కె.నిఖిల పర్యవేక్షణలో ధరణి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి వారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ ధరణి సమస్యలను తెలుసుకుంటున్నారు. రైతులు జిల్లా కేంద్రానికే వచ్చి అత్యధికంగా ఫిర్యాదులు చేస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వికారాబాద్, తాండూరు డివిజన్లలోనే ధరణి ఫిర్యాదులు పరిశీలించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలను ఆర్డీఓలు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆయా డివిజన్లలో సమావేశాలను నిర్వహించే తేదిలను కూడ ప్రకటించారు. తాండూరు డివిజన్లో మంగళవారం, రేపు దౌల్తాబాద్, 16న తాండూరు, 19న బషీరాబాద్, 20న కోడంగల్, 21న బొంరాస్ పేట్, 22న యాలాల మండలంలో సమావేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ డివిజన్లో మగళవారం పూడూరు, రేపు పరిగి, 16న మోమిన్ పేట్, 19న నవాబ్ పేట్, 20న దోమ, 21న కోట్ పల్లి, 22న కుల్కచెర్ల, 23న చౌడాపూర్, 26 ధారూర్, 27 మర్పల్లి, 28 బంట్వారం, 29న వికారాబాద్లలో నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

