తోడేస్తున్నారు..!
– కుళాయిలుకు బోరు మోటార్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో తాగునీటిని తోడేస్తున్నారు. యేధేచ్చగా కుళాయిలకు బోరు మోటార్లు బిగించి వినియోగిస్తున్నారు. దీంతో కొందరికి తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 8 వేల నీటి కనెక్షన్లు ఉన్నాయి. గతంలో పట్టణం మొత్తం 6.5 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం మిషన్ భగీరథతో ఈ సామర్థ్యాన్ని పెంచారు. అయినా కూడ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాగునీటి సరఫరా సమయంలో పలువురు వ్యక్తులు బోరు మోటార్లు వినియోగిస్తుండడంతో ఇతరులకు తాగునీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని వాపోతున్నారు. పట్టణంలోని సాయిపూర్, ఇందిరానగర్, మల్రెడ్డిపల్లి, హేరూర్ వార్డు, పాత తాండూరు, వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో బోరు మోటార్లతో నీటిని తోడేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సంబంధిత అ ధికారులకు విషయాన్ని తెలిపినా పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమయంలో బోరు మోటార్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


