పల్లె పోరుకు కసరత్తు..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పల్లె పోరుకు కసరత్తు..!
– జనవరితో ముగుస్తున్న సర్పంచుల పదవీకాలం
– ఈలోగా ఎన్నికల నిర్వహణపై దృష్టి
– ఈసారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇప్పడే అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అప్పుడే పల్లె పోరుకు ఎన్నికల సంఘం కరసత్తును ప్రారంభించింది. వచ్చే యేడాదిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. 2024 జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఇటీవల కార్యదర్శులను సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలు పంపాలని అధికారులు ఆదేశించారు.

ఈసారి ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..?
పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ చర్యలు చేపట్టింది. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించిన విషయం విదితమే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఈవీఎంల వినియోగంపై ఇటీవల ఎస్‌ఈసీ కసరత్తు చేసింది. చివరకు గతంలో మాదిరిగా బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించి అదేరోజు ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండగా బ్యాలెట్‌ పెట్టెలపై అతికించాల్సిన పేపర్‌ సీల్స్‌, అడ్రస్‌ ట్యాగ్స్‌ ముద్రణకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ ఉండదు. కానీ అభ్యర్థులకు ఆయా పార్టీల మద్దతు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదార్లు నెగ్గితే తర్వాత వచ్చే పార్లమెంటు పోరుపై ఆ ప్రభావం ఉంటుంది.

కసరత్తు మొదలు..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే పోలింగ్‌ సిబ్బందిని గుర్తించాలని, Te-poll సాఫ్ట్‌వేర్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేసి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.

ఈనెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండాలని, 200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ బూత్‌, అందులో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లున్న పోలింగ్‌ బూత్‌లో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 400 నుంచి 650 మంది ఓటర్లున్న పోలింగ్‌ బూత్‌లో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారుల చొప్పున సిబ్బందిని నియమించాలని, అదనంగా 20 శాతం మందిని ఎంపిక చేసి రిజర్వ్‌లో ఉంచాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!