
సీఎం సొంత జిల్లాలో హస్తంకు షాక్..!
– ఎమ్మెల్సీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్
– మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి విజయం
మహబూబ్నగర్, దర్శిని ప్రతినిధి : మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.

దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ బరిలో నిలిచారు. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు కలిసోచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.

ఇదికూడా చదవండి…

