పొలం కంచె యమపాశమై..!
– విద్యత్ షాక్తో విద్యార్థి మృతి
– బషీరాబాద్ నంద్యానాయక్ తాండాలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అడవి జంతువుల నుంచి పొలానికి వేసిన సోలార్ విద్యుత్ కంచె ఓ విద్యార్థి పాలిట యమపాశం అయ్యింది. విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నంద్యా నాయక్ తాండాలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన శంకర్ రాథోడ్ కుమారుడు అవినాష్ రాథోడ్(19) పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్నాడు.
అయితే బుధవారం రాత్రి తాండాకు చెందిన ఇద్దరు స్నేహితులో కలిసి తాండా సమీపంలోని దామర్ చెడ్ వైపు వెళ్లారు. మార్గంలో తాండాకు చెందిన బలరాం తన పొలంకు అడవి జంతువుల రక్షణ కోసం సోలార్ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి వేళ గమనించని అవినాష్ పొలం సమీపంలో ఉన్న విద్యుత్ కంచెను తాకాడు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
భయపడిన ఇద్దరు స్నేహితులు తాండా వాసులకు విషయాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంభీకులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. సంఘటనపై బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. విద్యార్థి మృతితో తాండాలో విషాధ చాయలు అలుముకున్నాయి.
ఇదికూడా చదవండి…

