పేదోళ్లకు ఇసుక ఫ్రీ..!
– సాండ్ పాలసీలో మార్పులు
– తాండూరులో 7 ఇసుక రీచ్ల గుర్తింపు
– మార్గదర్శకాలను ఖరారు చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంతింటిని నిర్మించుకోవాలనుకునే పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలని వికారాబాద్ జిల్లా అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో సాండ్ పాలసీలో మార్పులు చేశారు. తక్కువ ధరకు ఇసుకను అందించడంతో పాటు పేదలకు ఉచితంగా అందించాలని మార్గ దర్శకాలను రూపొందించారు. గత నెల 12న తాండూరు ఎమ్మెల్యే కలెక్టర్ను కలిసి ఇసుక మంజూరు విషయాలపై చర్చించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తాండూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్లను గుర్తించారు. తాండూరులో ప్రధాన కాగ్నానది ప్రవాహక ప్రాంతాలలో తాండూరు, బషీరాబాద్ మండలం గంగ్వార్, నావంద్గి, పెద్దేముల్ మండలం రేగొండి, కొండాపూర్, మరో రెండు ప్రాంతాలతో కలిపి మొత్తం 7 ఇసుక రీచ్లను గుర్తించారు.
ప్రభుత్వ పనులకు, పేదలకు ఉచితం
జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ పనులకు, పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించారు. రాయల్టీ, ఇతర చట్టపరమైన మొత్తం చెల్లింపుపై ఈ విధానం అమలు చేయనున్నారు. ఇసుక మంజూరు విషయంలో మండలాల్లో తహసీల్దార్లు, మున్సిపల్లో కమీషనర్లకు బాధ్యతలను అప్పగించారు. ఒక ట్రాక్టర్ ఇసుక లోడ్కు రూ. 600లు చెల్లించాలి. ఒక రాయల్టీ-120, డీఎంఎఫ్ -36, ఎస్ఎంఈటీ-24, అమ్మకం పన్ను-120, నీటీ పన్ను -24 మొత్తం రూ.330లు చెల్లించాల్సి ఉంటుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పేరుతో డీడీ చెల్లిస్తేనే ఇసుక అనుమతులు జారీ అవుతాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతులు ఉంటాయి.
ఇవే నిబంధనలు
ఇతర పనులకు ఇసుక అవసరమైతే ట్రాక్టర్ల వివరాలను తహసీల్దార్, కమీషనర్లకు ముందుగా అందజేయాలి. అంతకంటే ముందు రూ. 25వేలు నుంచి రూ. 50వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఇసుక అనుమతులు పొందిన చోట కాకుండా మరోచోట నిల్వ చేస్తే చర్యలు తప్పవు. రీచ్ పాయింట్ల వద్ద పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రర్ వివరాలు నమోదు చేస్తారు. వారానికోసారి తహసీల్దార్కు నివేధిక అందిస్తారు. ఈ నివేధికను తహసీల్దార్ కలెక్టర్కు అందజేస్తారు.
ఇదికూడా చదవండి…

